Narendra Modi: దురదృష్టం ఏంటంటే.. కొందరు ఆవు పేరు వింటేనే వణికిపోతున్నారు: మోదీ వ్యంగ్యం

  • ఆ పేర్లు వింటుంటే దేశం వెనక్కి వెళ్లినట్టు భావిస్తున్నారు
  • ఆవుల విషయంలో రువాండా ఆదర్శం
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకండి

దురదృష్టవశాత్తు దేశంలో ఆవు పేరును వింటేనే కొందరు వణికిపోతున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా అన్నారు. ఆవు, ఓం పేర్లను వింటుంటే దేశం 16వ శతాబ్దానికి వెళ్లిపోయినట్టుగా భావిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో నిన్న నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు విషయంలో ఆఫ్రికాలోని రువాండా దేశం అనుసరిస్తున్న విధానాలు తనను ఆకర్షించాయన్నారు. అక్కడ ప్రభుత్వమే ప్రజలకు ఆవులను అందజేసే కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఆవులు లేని వారికి వాటిని ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తోందన్నారు.  

పశువుల్లో వ్యాపించే ఫుట్ అండ్ మౌత్ వ్యాధితోపాటు బ్రెసెల్లోసిస్ వ్యాధుల నివారణకు సంబంధించి జాతీయ పశువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం సెప్టెంబరు 11న స్వామి వివేకానంద చికాగోలో చారిత్రక ఉపన్యాసం ఇచ్చి దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పారని, దురదృష్టవశాత్తు సెప్టెంబరు 11న ప్రపంచాన్ని వణికించిన ఉగ్రదాడి అమెరికాలో జరిగిందని మోదీ విచారం వ్యక్తం చేశారు.

More Telugu News