Narendra Modi: ట్విట్టర్ లో 5 కోట్ల మంది ఫాలోవర్లు.. తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ!

  • తొలి రెండు స్థానాల్లో ఒబామా, ట్రంప్
  • మూడో స్థానంలో నిలిచిన ప్రధాని మోదీ
  • సోషల్ మీడియా మొత్తంలో రెండో స్థానం

ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏకంగా 5 కోట్ల మందిని దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 10.8 కోట్ల మంది ఫాలోవర్లతో ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవగా, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 6.4 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఒబామా, ట్రంప్ తర్వాత మోదీ మూడో స్థానంలో నిలిచారు.

కాగా, ఈ సందర్భంగా 5 కోట్ల మంది ఫాలోవర్లు దాటిన మోదీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షితులైన ఆనేక మంది ప్రజలు ప్రధానిని సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారని చెందారు. ప్రధాని మోదీ పట్ల దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మోదీకి  ఫేస్ బుక్ లో 4.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో 2.5 కోట్ల మంది యూజర్లు మోదీని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒబామా 18.27 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉండగా, మోదీ 11.09 కోట్ల మంది ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచినట్లు ‘సెమ్ రష్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.

More Telugu News