Andhra Pradesh: గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని టార్గెట్ చేసిన నారా లోకేశ్!

  • గతంలో కాసు మాట్లాడిన వీడియో విడుదల
  • వైసీపీ రౌడీయిజం చేస్తోందని లోకేశ్ ఆగ్రహం
  • కాసుపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, పోలీసులకు సవాల్

తెలుగుదేశం పార్టీ ఈరోజు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని చేపట్టగా, పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని నారా లోకేశ్ టార్గెట్ చేసుకున్నారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం చేస్తోందని చెప్పడానికి ఈ మాటలే నిదర్శమని ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు.

టీడీపీ వాళ్లను బహిరంగంగా బెదిరిస్తున్న కాసు మహేశ్ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము పోలీసులు, హోంమంత్రికి ఉందా? అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామగ్రామాన, వీధివీధిన ఇలాంటి హెచ్చరికలే వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు టీడీపీ వెనక్కి తగ్గదని లోకేశ్ స్పష్టం చేశారు.

పోలీసులు అక్రమ కేసులు పెట్టినా, నిర్బంధించినా తమ పోరాటం ఆగదనీ, ముందుకు పోతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు, మానవహక్కుల నేతలు ఈ దారుణాలను ప్రశ్నించాలని కోరారు. టీడీపీ పోరాటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలనీ, రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News