Anna Canteen: అన్న క్యాంటీన్లకు వైఎస్సార్ లేదా బొత్స క్యాంటీన్లని పేరు పెట్టుకోండి: వైసీపీ సర్కారుపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

  • విశాఖ కేజీహెచ్ అన్న క్యాంటీన్ ను సందర్శించిన నేతలు
  • అన్న క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్న అయ్యన్నపాత్రుడు
  • అన్న క్యాంటీన్లలో కూడా ఆదాయం వెతుకుతున్నారని ఆరోపణ

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను మూసివేయడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు. అన్న క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. అన్న క్యాంటీన్ల పేరు మార్చి వైఎస్సార్ లేదా బొత్స క్యాంటీన్లుగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఆఖరికి అన్న క్యాంటీన్లలో కూడా ఆదాయం వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల రంగులు మార్చడానికి రూ.16 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

తన రాజకీయ అనుభవంలో 3 నెలల్లోనే వైఫల్యం చవిచూసిన తొలి ప్రభుత్వం ఇదేనని, రాష్ట్రపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. ఇవాళ టీడీపీ, బీజేపీ నేతలు విశాఖ కేజీహెచ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు. క్యాంటీన్ ను సందర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఈ క్యాంటీన్ ను సొంత నిధులతో నిర్వహిస్తున్నారు.

More Telugu News