Chandrababu: నేను ఆత్మకూరుకు వస్తున్నా.. టీడీపీ కార్యకర్తలకు భరోసా నింపుతాం!: చంద్రబాబు నాయుడు

  • వైసీపీ వేధింపుల విషయంలో స్పందించిన చంద్రబాబు
  • ఈ నెల 11న పల్నాడు ఆత్మకూరుకు వస్తానని వెల్లడి
  • బాధితులను ఎందుకు ఆదుకోలేదని నిలదీత

తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ మద్దతుదారులు, కార్యకర్తలు గ్రామాలు వదిలిపోవడం, ఇళ్లు బోసిపోవడం, భూములు బీళ్లు పడటం పుకార్లే అయితే తాము ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉన్నది ఎవరని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సొంతూరు వదిలేసిన చాలామంది టీడీపీ మద్దతుదారులు పరాయి గ్రామాల్లో తలదాచుకోవడం అవాస్తవమా? అని నిలదీశారు. వైసీపీ నేతలు కళ్లెదుట కనబడుతున్న నిజాలను ఎందుకు చూడలేకపోతున్నారనీ, బాధితుల కన్నీళ్లు ఎందుకు తుడవలేకపోతున్నారని అడిగారు. ఈ బాధితుల్లో భరోసా నింపేందుకు ఈ నెల 11న తానే పల్నాడులోని ఆత్మకూరుకు వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, హక్కులను కాపాడేందుకు ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News