Fawad Hussain: చేతకాని పని జోలికి వెళ్లడం ఎందుకు? బొక్కబోర్లాపడడం ఎందుకు?: చంద్రయాన్-2పై కారుకూతలు కూసిన పాక్ మంత్రి

  • చంద్రయాన్-2 వైఫల్యంపై ఫవాద్ హుస్సేన్ అనుచిత వ్యాఖ్యలు
  • ఎండియా (Endia) అంటూ వికటానందం  
  • ట్రోల్ చేసిన నెటిజన్లు

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. చంద్రయాన్-2 ప్రయోగంపై యావత్ ప్రపంచం భారత్, ఇస్రోల పట్ల సానుభూతి వచనాలు పలుకుతుంటే, పాక్ మాత్రం సెటైర్లు వేస్తోంది. చేతకాని పని జోలికి వెళ్లడం ఎందుకు? బొక్కబోర్లాపడడం ఎందుకు? అంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా 'ఎండియా' (Endia) అంటూ భారత్ కథ ముగిసింది అనే ధోరణిలో వ్యంగ్యం ప్రదర్శించాడు. దాంతో నెటిజన్లు ఆయనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశారు.

దాంతో మళ్లీ ట్విట్టర్ లో స్పందించిన ఫవాద్ హుస్సేన్, విఫల ప్రాజెక్టు కోసం రూ.900 కోట్లు ఖర్చు పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రధాని మోదీ తనేదో వ్యోమగామి అయినట్టు ప్రసంగాలు దంచుతున్నాడని వ్యాఖ్యానించారు. అయితే ఈసారి పాకిస్థాన్ నెటిజన్లే మంత్రికి గడ్డిపెట్టారు. "మనకు సాధ్యం కానిది భారత్ చేస్తోందంటే ప్రోత్సహించాలి కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? దయచేసి పాకిస్థాన్ పరువు తీయొద్దు" అంటూ హితవు పలికారు.

More Telugu News