Andhra Pradesh: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఉద్యోగం పోయిందని.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన యువకుడు!

  • ఆంధ్ర్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఘటన
  • ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న వీరకుమార్ రెడ్డి
  • ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం

ఆరోగ్య శ్రీ ట్రస్ట్  బోర్డులో ఉద్యోగం పోవడంతో ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. తాను పనిచేసే కార్యాలయం వద్దకు చేరుకుని బట్టలు విప్పేసి వింతవింతగా ప్రవర్తించాడు. చివరికి పోలీసులతోనూ ఘర్షణకు దిగాడు. దీంతో అతడిని మానసిక వైద్యశాలకు తరలించిన డాక్టర్లు మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా సత్యవేడు గ్రామానికి చెందిన వడ్డి వీరకుమార్ రెడ్డి గుంటూరులోని ఆరోగ్య శ్రీ ట్రస్టులో ఐటీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అయితే కారణాంతరాల వల్ల ఇటీవల వీరకుమార్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు.

దీంతో గుంటూరు పట్టణంలోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న వీరకుమార్ రెడ్డి తన ఒరిజినల్ సర్టిఫికెట్లను చించిపడేశాడు. అనంతరం వెంట తెచ్చుకున్న ల్యాప్ టాప్ ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. బట్టలన్నీ విప్పేసి ట్రస్ట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో సెక్యూరిటీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా, వారితోనూ దురుసుగా ప్రవర్తించాడు. చివరికి అధికారులు వీరకుమార్ రెడ్డిని గుంటూరులోని సర్వజనాసుపత్రికి తరలించగా, అక్కడ మానసిక చికిత్స విభాగంలో చేర్పించారు. అయితే బాధితుడు సహకరించకపోవడంతో బలవంతంగా మత్తు మందు ఇచ్చిన డాక్టర్లు అతడిని నిద్రపుచ్చారు.

More Telugu News