Andhra Pradesh: గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లు, షాపులపై వైసీపీ శ్రేణుల దాడి!

  • గుంటూరు జిల్లాలోని గుడిపూడిలో ఘటన
  • నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సత్తెనపల్లి మండలంలోని గుడిపూడిలో టీడీపీ నేతల దుకాణాలు, ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుడిపూడిలో నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని టీడీపీ నేతల ఇళ్లు ఉన్న వీధి నుంచి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, షాపులు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డాయి.

ఈ విషయమై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, మద్దతుదారులు మద్యం సీసాలతో తమ ఇళ్లపై దాడిచేశారని ఆరోపించారు. ఇదే మార్గంలో ఉన్న తమ షాపుల అద్దాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు గాయలయ్యాయని చెప్పారు. వైసీపీ నేతలు తమ దాడులతో తమను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News