Pawan Kalyan: జగన్‌ చిత్తశుద్ధి ఉన్న నాయకుడు...మాయల మరాఠీ కాదు : పవన్‌కు బొత్స కౌంటర్‌

  • భూదోపిడీ సహించనని ప్రగల్బాలు పలికారు
  • ఇప్పుడు చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతున్నారా?
  • చంద్రబాబుకు, పవన్‌కు స్థలం ఇచ్చింది ఒక్క వ్యక్తే కదా

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాయలో చిక్కుకున్నానని, అందుకే రాజధానిపై అలా మాట్లాడుతున్నానంటూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ బొత్సపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బొత్స పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాయల మరాఠీ కాదని, నేనేమీ ఆయన మాయలో చిక్కుకోలేదన్నారు. జగన్‌ చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అని, అందుకే ఆయన వెంట బాధ్యతగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.  పవన్‌ వ్యవహార శైలి చూస్తే అవినీతిని ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు.

అమరావతిలో భూదోపిడీ సహించనని ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు స్థలం ఇచ్చింది ఒకే వ్యక్తి అని, అందుకే చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్‌ పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.

More Telugu News