East Godavari District: హెడ్మాస్టర్ కిడ్నాప్.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం

  • తొస్సిపూడి ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి
  • కారును అటకాయించి కిడ్నాప్ 
  • రాత్రి 9:30కు కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద విడిచిపెట్టిన దుండగులు

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం తొస్సిపూడిలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం రేపింది. శుక్రవారం పాఠశాల ముగిసిన అనంతరం హెడ్మాస్టర్ శ్రీనివాస్‌రెడ్డి కారులో జి.మామిడాడలోని ఇంటికి బయలుదేరారు. బిక్కవోలు మండలం కొంకుదురు సమీపంలో శ్రీనివాస్‌రెడ్డి కారును కొందరు దుండగులు అడ్డగించారు. అనంతరం హెడ్మాస్టర్‌ను బయటకు లాగి బలవంతంగా వారి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

విషయం తెలియని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పొద్దుపోతున్నా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందారు. ఆయన కుమారుడు పవన్ బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా, శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు రాత్రి 9:30 గంటల సమయంలో ఆయనను కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టి పరారయ్యారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News