Ambati Rayudu: మళ్లీ వస్తున్నా... రిటైర్మెంటు నిర్ణయం వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు

  • వరల్డ్ కప్ సమయంలో రిటైర్మెంటు ప్రకటించిన రాయుడు
  • సెలెక్టర్ల వైఖరితో మనస్తాపం!
  • సీనియర్ల హితబోధతో నిర్ణయం మార్పు
  • హెచ్ సీఏ వర్గాలకు లేఖ

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కొన్నివారాల కిందట ప్రకటించిన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఆడతానని రాయుడు తన లేఖలో పేర్కొన్నాడు.

వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తనకు చోటు కల్పించకపోవడం పట్ల రాయుడు భారత సెలెక్టర్ల బృందంపై అలకబూనిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పైనా సెటైర్ వేసి ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యవసానంగా, రిజర్వ్ ప్లేయర్ కోటాలో కూడా మధ్యంతర ఎంపికకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో, తాను ఇక క్రికెట్ ఆడలేనంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కు అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంటు ప్రకటించాడు. ఆఖరికి బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ లో కూడా ఆడబోనని తేల్చిచెప్పాడు.

కానీ, శ్రేయోభిలాషుల హితబోధతో రాయుడు మనసు మార్చుకున్నట్టు అర్థమవుతోంది. తన లేఖలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. రిటైర్మెంటుపై పునరాలోచన విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దలతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ తనకు మార్గదర్శనం చేశారని రాయుడు వెల్లడించాడు. కష్టకాలంలో వారు అండగా నిలిచారంటూ కృతజ్ఞత వ్యక్తం చేశాడు. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారని, రిటైర్మెంట్ నిర్ణయం తీవ్ర భావోద్వేగాల నడుము తీసుకున్నదని రాయుడు తెలిపాడు.

అయితే, ప్రస్తుతం టీమిండియాలో చోటు లభించాలంటే అపారమైన ప్రతిభ మాత్రమే కాదు, కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే, ప్రస్తుతం భారత జట్టులో ప్రతి స్థానానికి ఇద్దరు ముగ్గురు క్రికెటర్లు పోటీలో ఉన్నారు. ధోనీ అంతటివాడికే జట్టులో స్థానంపై భరోసా లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ధోనీని పట్టించుకోని సెలెక్టర్లు పంత్ వైపు మొగ్గుచూపారు.

More Telugu News