Botsa Satyanarayana: బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్

  • అమరావతిపై బురద చల్లడానికి నన్ను వాడుకుంటున్నారు
  • బొత్స చూపించిన జీవో 2012 నాటిది
  • నన్ను టార్గెట్ చేసి.. వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ మండిపడ్డారు. రాజధాని అమరావతిపై బురద చల్లడానికి తనను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేస్తే ఊరుకున్నానని... ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం సరికాదని అన్నారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో గత ముఖ్యమంత్రి వియ్యంకుడికి స్థలాన్ని ధారాదత్తం చేశారని బొత్స ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ, స్థలం ధారాదత్తం చేశారని బొత్స అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. 2007లో కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ కోసం 498.39 ఎకరాలను తీసుకున్నామని తెలిపారు. బొత్స చూపించిన జీవో 2012 నాటిదని చెప్పారు. అప్పటికి తన వివాహం కూడా జరగలేదని... పెళ్లికి ముందు జరిగిన ఆ వ్యవహారాన్ని... తర్వాత జరిగిన పరిణామాలకు ముడిపెడుతున్నారని విమర్శించారు. తనను టార్గెట్ చేసి, వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు.

More Telugu News