Sahoo: రికార్డులన్నీ బద్దలే... 'సాహో'పై దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు!

  • తొలి రివ్యూ చెప్పిన ఉమైర్ సంధూ
  • 2.51 గంటల నిడివితో చిత్రం
  • ప్రభాస్ ఎంట్రీతోనే పైసా వసూల్

'బాహుబలి' రెండు భాగాల తరువాత ప్రభాస్ హీరోగా, సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన 'సాహో' 30వ తేదీన విడుదలకు సిద్ధం కాగా, ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. 2.51 గంటల నిడివి వున్న చిత్రం అద్భుతంగా ఉందని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు వరుస ట్వీట్లు పెట్టారు. పెద్ద సినిమాల విడుదలకు ముందు తొలి రివ్యూను ఇచ్చే ఉమైర్, చిత్రం సూపరన్నారు. తొలి సగ భాగం తరువాత ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారని, ప్రభాస్ ఎంట్రీతోనే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని అన్నారు.

యాక్షన్ సీన్స్, ఛేజింగ్ లు మతి పోగొట్టేలా ఉన్నాయని, ఈ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని అన్నారు. ఈ సినిమా సాలిడ్ ఎంటర్‌ టెయినర్ అని, అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదమే ఉందని అన్నారు. గత రికార్డులను కొల్లగొట్టే బ్లాక్‌ బస్టర్ అంటూ పొగడ్తలు కురిపించారు. కాగా, ఉమైర్ సంధు రివ్యూలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఉమైర్ కొన్ని పెద్ద చిత్రాలు అద్భుతమని రివ్యూలు ఇవ్వగా, అవి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు 'స్పైడర్', పవన్ కల్యాణ్ 'ఆజ్ఞాతవాసి' తదితర చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అని సంధూ తెలుపగా, అవి అభిమానులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఇక 'సాహో' పరిస్థితి ఏంటన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.

More Telugu News