Arun Jaitly: దేశం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయింది : అరుణ్‌జైట్లీ భార్యకు సోనియా సంతాప లేఖ

  • పార్టీలకతీతంగా అభిమానించే నేత ఆయన
  • మృత్యువుతో చివరి వరకు పోరాడిన వ్యక్తి
  • దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వ్యక్తి నిష్క్రమణ జీర్ణించుకోలేనిది

అరుణ్‌ జైట్లీ మరణంతో దేశం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయిందని, రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అరుణ్‌ జైట్లీ అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. అరుణ్‌ జైట్లీ భార్య సంగీతా జైట్లీకి ఈ మేరకు ఆమె సంతాప లేఖ రాశారు. దేశానికి ఇంకా విలువైన సేవలు అందించాల్సిన మీ భర్త ఇంతలోనే ఈలోకం నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేనిదన్నారు. మృత్యువుతో చివరి వరకు పోరాడిన ధీరోదాత్తుడు జైట్లీ అని సోనియా ఆ లేఖలో కొనియాడారు.

ఏ పదవిలో ఉన్నా గొప్ప వాగ్ధాటి, విజ్ఞతతో వ్యవహరించేవారన్నారు. ‘ఈ కష్టకాలంలో ఏ మాటలు మిమ్మల్ని ఓదార్చలేవని నాకు తెలుసు. కానీ ఇటువంటి కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి, ఆదుకోవడానికి నేనున్నాను’ అంటూ ఆ లేఖలో సోనియా పేర్కొన్నారు. అరుణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News