Telangana: కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజ్ తరుణ్!

  • ఒక్కసారిగా టర్న్ తీసుకోవడంతో నియంత్రణ కోల్పోయా
  • నా కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొట్టింది
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ నటుడు

నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదం తర్వాత నటుడు రాజ్ తరుణ్  అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ అభిమానుల్లో ఆయన భద్రతపై ఆందోళన నెలకొంది. దీంతో తాజాగా నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.

తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని రాజ్ తరుణ్ తెలిపాడు. నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని చెప్పాడు.

‘నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు.

More Telugu News