Chidambaram: సుప్రీంకోర్టు కారిడార్లలో చిదంబరం, కపిల్ సిబల్ ఉరుకులు పరుగులు!

  • చిదంబరం ముందస్తు బెయిల్ రద్దు
  • ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం
  • సుప్రీంకోర్టు తలుపు తట్టిన మాజీ ఆర్థికమంత్రి
  • నేడు ఊరట లభించకుంటే అరెస్ట్ తప్పదంటున్న నిపుణులు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసిన తరువాత, తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న ఆలోచనలో పడ్డ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, సుప్రీంకోర్టులో పరుగులు పెట్టారు. సీబీఐ, ఈడీ అధికారులు తన వద్దకు వస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న ఆయన, ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ వెంటనే తదుపరి కర్తవ్యం ఏంటని పార్టీ సహచరుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ను సంప్రదించారు. ఆ సమయంలో కోర్టులోనే మరో ప్రాంతంలో ఉన్న కపిల్ సిబల్, వెంటనే చిదంబరం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారు ఇరువురూ కోర్టు హాల్ లో అటూఇటూ హడావుడిగా తిరగడం కనిపించింది.

ఆపై మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, సల్మాన్‌ ఖుర్షీద్‌ లు వారిని కలిశారు. వెంటనే అందరూ కలిసి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ చాంబర్‌ ముందుకు వెళ్లారు. అత్యవసరంగా తమ వాదన వినాలని కోరారు. కానీ, గొగొయ్ అందుకు అనుమతించలేదు. వారు లోనికి వచ్చేందుకు అనుమతించని గొగొయ్, ఏమైనా చెప్పాలనుకుంటే బుధవారం రావాలని సూచించారు.

ఆపై చిదంబరం తన మెదడుకు పనిపెట్టారు. శరవేగంగా ఆలోచించి, కోర్టు వ్యవహారాలు బాగా తెలిసిన ఓ అధికారిని కలిశారు. మంగళవారం కేసు విచారణ కుదరలేదు కాబట్టి, బుధవారం తొలి గంట వ్యవధిలోనే అపీలును కోర్టు విచారించేలా రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) సూర్య ప్రతాప్‌ సింగ్‌ కు పిటిషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతో వారు స్వయంగా రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లి ఆ పిటిషన్‌ ను ఇచ్చారు.

మామూలుగా అయితే, అత్యవసర పిటిషన్లను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తే రోజువారీగా నిర్ణయిస్తారు. కానీ, నేడు అయోధ్య కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉండటం, రాజ్యాంగ ధర్మాసనంలో రంజన్ గొగొయ్ బిజీగా ఉంటారు కాబట్టి, ఈ పిటిషన్‌ ను పరిశీలించే బాధ్యత జస్టిస్‌ ఎన్వీ రమణకు అప్పగించవచ్చని భావిస్తున్నారు.

More Telugu News