Odisha: భర్త ఆచూకీ చెప్పాలంటూ గర్భిణి పొట్టపై బూటు కాలితో తన్నిన మహిళా ఎస్పీ!

  • గర్భవిచ్ఛిత్తితో విలవిల్లాడిన మహిళ
  • ఎస్పీపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు
  • కోర్టు ఆదేశాలతో ఎస్పీపై క్రిమినల్ కేసు నమోదు

ఓ కేసులో నిందితుడైన వ్యక్తి ఆచూకీ చెప్పాలంటూ ఓ మహిళా ఎస్పీ విచక్షణ రహితంగా వ్యవహరించింది. గర్భిణి అని కూడా చూడకుండా సాటి మహిళ పొట్టపై బూటు కాలితో తన్నింది. గర్భవిచ్ఛిత్తి జరగడంతో బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఒడిశాలో జరిగిందీ ఘటన.

గత నెల మూడో తేదీన సుందర్‌గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. దీంతో స్పందించిన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా కేసు పర్యవేక్షణ చేపట్టారు.

నిందితుల్లో బాధితురాలు ప్రియాడే భర్త ఉత్తమ్ డే కూడా ఉన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు. దీంతో ఆమెకు గర్భ విచ్ఛిత్తి జరిగింది.

గర్భిణి అని కూడా చూడకుండా పొట్టపై కాలితో తన్ని తన గర్భ విచ్ఛిత్తికి కారణమైన ఎస్పీ సౌమ్య మిశ్రాపై చర్యలు తీసుకోవాలంటూ ప్రియాడే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఎస్పీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎస్పీపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News