Andhra Pradesh: టీడీపీ నేతలకు ముందే టైం చెప్పి మరీ చావగొట్టిన వైసీపీ శ్రేణులు!

  • శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఘటన
  • ఎమ్మెల్యే సిదిరి భార్యపై అనుచిత పోస్ట్
  • కోపంతో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి

ఓ సోషల్ మీడియా పోస్టు శ్రీకాకుళం జిల్లాలో వేడిని రాజేసింది. అధికార ఎమ్మెల్యే భార్యపై టీడీపీ నేతలు తప్పుడు పోస్ట్ చేయడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ‘సాయంత్రం ఆకుపూజకు రెడీ అవ్వండిరా తెలుగుతమ్ముళ్లు’ అంటూ టైం చెప్పి మరీ టీడీపీ నేతలను చావబాదారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామ వాలంటీర్ ఉద్యోగుల నియామకంలో భారీగా నగదు చేతులు మారిందని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు చక్కర్లు కొట్టాయి. ఎమ్మెల్యే  సీదిరి అప్పలరాజుకు తెలియకుండానే మండలస్థాయి వైసీపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని అందులో ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలరాజు భార్యపై ఓ అనుచిత పోస్ట్ రాగా, దాన్ని టీడీపీ తలగాన రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు పోస్ట్ చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వీరిని స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

అయితే ఈ మెసేజ్ గురించి తెలుసుకున్న కొందరు వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘సాయంత్రం ఆకుపూజకు రెడీ అవ్వండిరా తెలుగు తమ్ముళ్లు’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన వైసీపీ నేతలు, రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త తలగాన రాజశేఖర్‌, టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు మండల లచ్చయ్యలను చితకబాదారు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు 8 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ దాడిని టీడీపీ నేతలు ఖండించారు.

More Telugu News