A pet dog: యజమానిపై చిరుత దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడి తరిమేసిన పెంపుడు శునకం!

  • పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో ఘటన
  • అరుణ అనే మహిళపై చిరుత దాడి
  • చిరుతపులితో భీకరంగా పోరాడిన ‘టైగర్’

యజమాని పట్ల ఓ పెంపుడు జంతువు అమిత విశ్వాసాన్ని చూపింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి చిరుతపులితో పోరాడింది. చివరికి యజమాని ప్రాణాన్ని కాపాడింది. పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో ఈ నెల 14న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డార్జిలింగ్ లోని ఓ ప్రాంతంలో అరుణ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వీరు రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అరుణ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లగా, అప్పటికే ఇంట్లో నక్కిన చిరుతపులి ఆమెపై దాడిచేసింది. అరుణ అరుపులు విన్న ‘టైగర్’ అనే శునకం ఒక్కసారిగా దూసుకొచ్చి చిరుతపులితో పోరాడటం మొదలుపెట్టింది.

చిరుతపులిపై గట్టిగా అరుస్తూ, దాన్ని కరుస్తూ బెదరగొట్టింది. దీంతో సదరు చిరుత ఇంటి నుంచి అటవీప్రాంతంలోకి పారిపోయింది. అరుణ ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో అరుణ కంటికి స్వల్ప గాయమైంది. టైగర్ కారణంగానే అరుణ ప్రాణాలు దక్కించుకుందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News