India: పాకిస్థాన్ కు మళ్లీ షాకిచ్చిన అమెరికా.. రూ.3,130 కోట్ల సాయం నిలిపివేత!

  • పాక్ ఆశలపై నీళ్లు చల్లుతున్న అగ్రరాజ్యం
  • గతేడాది రూ.2,134 కోట్ల సాయానికి బ్రేక్
  • ఉగ్రవాదంపై పాక్ నిర్లక్ష్యానికి మరో రూ.7 వేల కోట్లు నిలిపివేత

అగ్రరాజ్యం అమెరికా మరోసారి పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు ఇప్పటివరకూ అందజేస్తున్న సాయంలో రూ.3,130 కోట్లు కోత పెట్టింది. జమ్మూకశ్మీర్ సమస్య విషయంలో అమెరికా తమకు మద్దతు ఇస్తుందని పాక్ కలలు కంటున్న వేళ అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం దాయాది దేశానికి శరాఘాతంగా మారింది. 2010లో కుదిరిన పెపా ఒప్పందం కింద రాబోయే ఐదేళ్ల కాలానికి రూ.53,356 కోట్లు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. తాజాగా అందులో రూ.3,130 కోట్ల మేర కోత పెడుతూ నిర్ణయం తీసుకుంది.

అమెరికా పాకిస్థాన్ కి సాయాన్ని ఆపేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ లో ఉగ్రవాదుల ఏరివేతపై పాక్ నిజాయితీగా వ్యవహరించడం లేదంటూ రూ.2,134 కోట్ల సైనిక సాయాన్ని నిలిపివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. హక్కానీ ఉగ్రవాద నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేయడంలో విఫలమయ్యారంటూ ఈ ఏడాది జనవరిలో మరో రూ.7,114 కోట్ల సాయాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ తాము ఆశించినంతగా పనిచేయడం లేదని ట్రంప్ ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

More Telugu News