Jagan: ఏపీ భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారు.. పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు

  • విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది
  • జగన్ ప్రభుత్వానిది ఉగ్రవాదం
  • జగన్‌కు ట్యాగ్ చేస్తూ పాయ్ ట్వీట్లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ ఉగ్రవాదంతో రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల నిలిపివేత, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పునఃసమీక్ష వంటివాటిపై పాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రచురితమైన వార్తలను ఆయన తన ట్వీట్‌కు జోడించారు.  

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒప్పందాలను తిరగదోడి బెదిరిస్తుంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు రారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో సింగపూర్ భారీగా పెట్టుబడులు పెట్టిందని, కానీ ఆ ఒప్పందాన్ని తిరగదోడడం వల్ల ఇకపై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. తన ట్వీట్లను ఆయన నేరుగా జగన్‌కే ట్యాగ్ చేయడం విశేషం.

More Telugu News