Undavalli: కృష్ణా నదికి 2009లో ఇంతకు మించిన వరద వచ్చింది.. మరిప్పుడు ఎందుకు ఇలా?: నారా లోకేశ్

  • నాడు ‘ప్రకాశం’ దగ్గర వరద 11 లక్షల క్యూసెక్కులు దాట నివ్వలేదు
  • చంద్రబాబు ఇంటిని ముంచే కుట్రా?
  • ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?

ఉండవల్లి కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు డ్రోన్ తిరిగిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న ఆయన నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ తిరిగిందని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మాటలను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

కృష్ణా నదికి 2009లో ఇంతకు మించిన వరద వచ్చిందని, అయినా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద 11 లక్షల క్యూసెక్కులు దాటనివ్వలేదని, మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఫ్లడ్ మేనేజిమెంట్ తెలియకా? లేక చంద్రబాబు ఇంటిని ముంచే కుట్రా? ఈ కక్ష సాధింపుచర్యల్లో ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంటిని ముంచేయడానికి వైసీపీ చేసిన మరో కుట్ర చూడండి అంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం వివరాలతో కూడిన పట్టికను పోస్ట్ చేశారు. నాగార్జునసాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులు అని, ఇప్పుడు జలాశయ నీటిమట్టం 586 అడుగులే ఉందని అన్నారు. అయినా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అంత వరద ఎందుకు వచ్చిందంటే.. నాగార్జునసాగర్ లోకి వస్తున్న వరదనీరు కంటే ఎక్కువ నీటిని ప్రకాశం బ్యారేజ్ కు విడుదల చేశారని అన్నారు.

More Telugu News