ఏపీ ఎమ్మెల్సీ స్థానాలు : ఇద్దరు ఖరారు?...మూడో స్థానానికే భారీ పోటీ

  • మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకే
  • అభ్యర్థుల ఎంపికపై అధినేత జగన్‌ కసరత్తు
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. పార్టీ కీలక నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో నిన్న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, కరణం బలరాంలు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కనుండడంతో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని, మిగిలిన ఒక్క స్థానం విషయంలోనే తర్జనభర్జన జరుగుతోందని సమాచారం.

మంత్రి మోపిదేవి వెంకటరమణ, హిందూపురంలో బాలకృష్ణపై పోటీచేసి ఓడిపోయిన ఇక్బాల్‌ పేర్లు  ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానానికి మాత్రం  మర్రి రాజశేఖర్, పండుల రవీంద్ర, ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. మరి అధినేత ఆశీర్వాదం ఎవరికో చూడాలి.
Go Back to Shorts
MLC vacancies
Jagan
YSRCP
mopidevi
ikhbal

More Telugu News