Lover: ప్రియురాలితో కలిసి భార్యను నీళ్లల్లోకి తోసేస్తే... కథ అడ్డం తిరిగి కటకటాలపాలు!

  • లవర్ ను వదల్లేక భార్యను చంపాలని ప్లాన్
  • సాగర్ సమీపంలో కాల్వలో విసిరేసిన భర్త
  • ప్రాణాలు కాపాడుకున్న భార్య

ఎనిమిది సంవత్సరాల నుంచి తనతో కాపురం చేస్తున్న భార్యను, ప్రియురాలితో కలిసి హత్యచేసేందుకు పథకం వేసిన ప్రబుద్దుడు, పథకం బెడిసికొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గుంటూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బత్తుల కల్యాణ్, అరుణలకు 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. అయితే, వీరి జీవితంలోకి మాచర్లకు చెందిన రమాదేవి రావడంతో తుపాను ఏర్పడింది. రమాదేవి, కల్యాణ్ ల మధ్య పరిచయం వివాహేతర బంధంగా మారగా, తమ మధ్య ఉన్న అరుణను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ భావించారు.

ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశంతో, సాగర్ మాత ఆలయంలో నిద్ర చేయాల్సివుందని నమ్మించి, శుక్రవారం సాయంత్రం మాచర్లకు తీసుకొచ్చి, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రమాదేవి స్నేహితుడు, ఆటో డ్రైవర్ సందీప్ తో కలిసి సాగర్ మాత ఆలయానికి చేరుకున్నారు. తాళ్లపల్లి వంతెన సమీపంలో మూత్ర విసర్జనకు ఆటో ఆపి, అరుణను కిందకు దిగాలని కోరగా, ఆమె దిగలేదు. దీంతో చేసేదేమీ లేక నాగార్జున సాగర్ లోని సాగర్‌ మాత ఆలయానికి అందరూ చేరుకున్నారు.
 
అర్ధరాత్రి వారి పథకాన్ని అమలు చేశారు. రమాదేవి, సందీప్, కల్యాణ్‌ లు అరుణను బలవంతంగా ఆటోలో ఎక్కించి, బొయ్యారం ప్రాంతంలో బ్రిడ్జిపై నుంచి నీళ్లల్లోకి నెట్టేశారు. ఆపై చనిపోయిందని భావించి వెళ్లిపోయారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో, కాల్వలో కార్లను కడిగే ప్రదేశానికి చేరుకుని ప్రాణాలు దక్కించుకుంది. ఆపై స్థానికుల సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగారు.

More Telugu News