Tirumala: వెంకన్నకు రూ. 14 కోట్ల భూరి విరాళం!

  • చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేత
  • వివరాలను గోప్యంగా ఉంచిన అధికారులు
  • భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు

తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన సదరు భక్తుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి రూ. 14 కోట్ల చెక్ ను స్వామివారికి కానుకగా అందించారు. టీటీడీ ఈ డబ్బును భక్తుల సంక్షేమార్థం వాడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

 కాగా, ఈ ఎన్నారై ఎవరన్న విషయాన్ని, అతని కోరిక మేరకు అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రావణ శుక్రవారం కావడం, వరుస సెలవులు రావడంతో స్వామి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి నేడు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మహిళలు ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమపూజ చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుచానూరులోనూ టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

More Telugu News