Vizag: ప్రియురాలిని వదిలి వుండలేక... భార్యకు సమాచారమిచ్చి ఆత్మహత్య!

  • విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • ప్రేమికులను విడదీసిన తల్లిదండ్రులు
  • భార్యకు చెప్పి ఆత్మహత్య చేసుకున్న భర్త

తాను మనసారా ప్రేమించిన యువతికి వేరే యువకుడితో వివాహం జరగడం, ఇదే సమయంలో తనకు మరో యువతితో పెళ్లి కావడంతో తట్టుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఊటగడ్డ ప్రాంతానికి చెందిన బొజ్జా సాయికుమార్‌ (28), ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న సమయంలో, అక్కడే పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోగా, పెద్దలు అంగీకరించలేదు.

ఈ క్రమంలో యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. సాయికుమార్ కు మూడు నెలల క్రితం శ్రావణి అనే యువతితో పెళ్లి అయింది. ప్రేమికులు విడిపోయినా, ఒకరిని ఒకరు విడిచివుండలేక పోయారు. శ్రావణి పక్కనుండగానే, సాయికుమార్ తన ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడటం, చాటింగ్ చేయడం వంటివి చేస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యా గొడవలు పెరుగగా, శ్రావణి పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఒంటరిగా ఉంటున్న సాయికుమార్, సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని భార్య శ్రావణికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో కంగారు పడిన ఆమె, భర్తకు ఫోన్‌ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఆందోళనతో ఆమె ఇంటికి చేరుకొని చూసేసరికి సాయికుమార్ ఉరి వేసుకొని కనిపించాడు. సాయికుమార్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News