Jammu And Kashmir: రాజ్యసభలో బిల్లు... ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నుంచి గెజిట్ విడుదల!

  • అనుకున్న ప్లాన్ ను పక్కాగా అమలు చేసిన కేంద్రం
  • రాజ్యసభకు బిల్లు వచ్చిన పది నిమిషాల్లోనే రాష్ట్రపతి గెజిట్
  • కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముందస్తు ప్రణాళిక ప్రకారం, బీజేపీ ఆలోచనలను పక్కాగా అమలు చేశారు. ఈ ఉదయం 11.15 గంటల సమయంలో నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దుకు సిఫార్సు బిల్లును ప్రవేశపెట్టగా, మరోపక్క నిమిషాల వ్యవధిలోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం పెట్టడం, ఆయన తరఫున గెజిట్ ను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేయడం జరిగిపోయాయి.

దీంతో ఆర్టికల్ 370తో పాటు, దానిలో భాగంగా ఉన్న 35A అధికరణ కూడా రద్దయినట్లయింది. ఇక ఈ బిల్లులోని మార్పుల ప్రకారం, కశ్మీర్ సరిహద్దులను మార్చే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఎమర్జెన్సీ విధించే అధికారాలు కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. ఎవరు కశ్మీర్ పౌరుడన్న అంశాన్ని నిర్ధారించేందుకు పాత చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చే అవకాశం ఉంది. ఇకపై పార్లమెంట్ లో చేసే ప్రతి చట్టం జమ్మూ కశ్మీర్లో అమలవుతుంది. కశ్మీర్ కు ఇంతకాలమూ ఉన్న స్వయం ప్రతిపత్తి ఇకపై ఉండదు.

More Telugu News