Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర మార్గంలో పాక్ కు చెందిన మందుపాతర, స్నిపర్ రైఫిల్ గుర్తింపు

  • అమర్ నాథ్ యాత్రను అడ్డుకునేందుకు పాక్ సైన్యం యత్నం
  • ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు, ఆయుధాల అప్పగింత
  • ఉగ్రదాడులపై హెచ్చరిస్తున్న ఇంటెలిజెన్స్

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురి పెట్టారు. అమర్ నాథ్ యాత్రను పాక్ సైన్యం ఛిన్నాభిన్నం చేయాలనుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిందని భారత ఆర్మీ తెలిపింది. చీనార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మాట్లాడుతూ, పాక్ సైన్యం అండతో అమర్ నాథ్ యాత్రలో హింసకు పాల్పడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని మూడు, నాలుగు రోజులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయని తెలిపారు.

యాత్ర మార్గంలో మందుపాతరలు, పేలుడు పదార్థాలు, స్నిపర్ రైఫిల్ గుర్తించామని... ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహకారం అందిస్తోందనే విషయం మరోసారి బయటపడిందని ధిల్లాన్ చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అమర్ నాథ్ యాత్రపై పంజా విసిరేందుకు పాక్ సైన్యం యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రశాంతంగా కొనసాగుతున్న యాత్రను అడ్డుకునే ఎలాంటి ప్రయత్నాన్నీ కూడా తాము సహించబోమని అన్నారు.

More Telugu News