Teamindia: టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తుల సునామీ!

  • 2000 దరఖాస్తులు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనం
  • ముగిసిన రవిశాస్త్రి పదవీకాలం
  • విండీస్ టూర్ వరకు పొడిగింపు

క్రికెట్ ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డు అంటే బీసీసీఐ అనే చెప్పాలి. టీమిండియా మార్కెటింగ్ నుంచి, ఐపీఎల్ క్రికెట్ వరకు బోర్డుకు కాసుల వర్షం కురుస్తుంది. అందుకే బీసీసీఐతో కలిసి పనిచేయడానికి అనేకమంది ఉత్సాహం చూపిస్తుంటారు. భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసే పారితోషికాలు వాళ్లను ఊరిస్తుంటాయి. ఓ కోచ్ ఏడాదికి కోట్ల రూపాయలు అందుకోవడం భారత్ లోనే సాధ్యమవుతుంది. టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకున్నట్టు ప్రచారంలో ఉంది. అందుకే, టీమిండియాకు కొత్త కోచ్ కావాలని ప్రకటన ఇవ్వడమే ఆలస్యం ఇప్పటివరకు 2000 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

అయితే, ప్రధానంగా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే అత్యధిక అవకాశాలు ఉండగా, శాస్త్రికి గట్టిపోటీ ఇస్తున్నవారిలో సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే ఉన్నారు. రవిశాస్త్రి పదవీకాలం వరల్డ్ కప్ తోనే ముగిసినా, నూతన కోచ్ ఎంపికయ్యే వరకు పదవీకాలాన్ని పొడిగించారు. విండీస్ టూర్ కు రవిశాస్త్రినే తాత్కాలిక కోచ్ గా కొనసాగుతాడు.

More Telugu News