nelluru: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక!

  • కన్నకూతురిపై అత్యాచారం చేసిన మానవ మృగం
  • ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపు
  • ప్రిగ్నెన్సీతో బయటపడిన దారుణం

కామంతో కళ్లుమూసుకుపోయి సభ్యసమాజం తలదించుకునే పనికి ఒడిగట్టాడో తండ్రి రూపంలోని మానవ మృగం. సాక్షాత్తు కన్నకూతురిపైనే అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. కుమార్తె ఇబ్బంది పడుతుండడం గమనించిన తల్లి అనుమానం వచ్చి బాలికను నిలదీసింది. దీంతో బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి భోరుమంది.

ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో తండ్రే తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తల్లివద్ద వాపోయింది. దీంతో జరిగిన ఘోరాన్ని తల్చుకుని కుమిలిపోయిన ఆ తల్లి ఏం చేయాలో అర్థంకాక అబార్షన్‌ చేయించేందుకు కావలిలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అబార్షన్‌ చేయాలని వైద్యులను కోరింది. అక్కడి వైద్యులు విషయం పోలీసులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలియడంతో తప్పు చేసిన తండ్రి చెన్నై పారిపోయేందుకు ముసునూరు వద్ద వాహనం కోసం వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఒప్పుకోవడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

More Telugu News