Vizag: పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  • మంత్రి సమక్షంలో తొలి సమావేశం
  • సమస్య పరిష్కారానికి సలహా కమిటీ చర్చిస్తుంది
  • న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటాం

విశాఖపట్టణానికి చెందిన పంచగ్రామాల భూ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పంచగ్రామాల భూ సమస్య పరిష్కార సలహా కమిటీ చైర్మన్, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం నిమిత్తం విజయవాడలోని ఆయన కార్యాలయంలో తొలి సమావేశం జరిగింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  

పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను సలహా కమిటీ చర్చించిన తదుపరి న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవటం జరుగుతుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఆ తర్వాత సలహా కమిటీ నివేదికను ప్రభుత్వానికి నివేదించటం ద్వారా ప్రభుత్వ నిర్ణయంతో ఎవరికీ నష్టం లేకుండా ప్రజలకు, సింహాచలం దేవస్థానానికి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిరాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ పద్మజ, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, డిప్యూటీ సెక్రటరీ సూర్యనారాయణ, సింహాచలం దేవస్థానం ఈవో, సలహా కమిటీ కన్వీనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News