Police: అమ్మాయిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ మామూలోడు కాదు!

  • తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా కేసు నమోదు
  • ఇటీవలే రవిశేఖర్ బారినపడిన ఇద్దరు మహిళలు
  • సమస్యలు తీర్చుతానంటూ మోసం చేసిన వైనం

అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడు రవిశేఖర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన ఓ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని కిడ్నాప్ కు పాల్పడ్డాడు. అయితే, అతడిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. తెరపైకి రాని బాధితులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా అమ్మాయిని కిడ్నాప్ చేసిన వ్యవహారం టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో రవిశేఖర్ ను గుర్తించిన ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇద్దరు మహిళలను రవిశేఖర్ మాటలతో మాయచేసి వాళ్లతో షికార్లు చేశాడు. సీతానగరం బస్టాండు సెంటర్ లో బస్సు కోసం వేచిచూస్తున్న మహిళ వద్దకు కారులో వచ్చిన రవిశేఖర్ తాను కూడా అటే వెళుతున్నానంటూ ఆమెను ఎక్కించుకున్నాడు. తాను విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగినని చెప్పుకుని ఆ రాత్రికి ఆమె ఇంటి వద్దనే గడిపాడు. ఆ తర్వాత రోజు ఆమె ఇంటిపక్కన ఉన్న మరో మహిళను పరిచయం చేసుకుని వారి సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చాడు.

వారి నుంచి రూ.65 వేలు తీసుకోవడమే కాకుండా ఓ రాత్రంతా వారితో కారులో తిరిగాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరినీ శ్మశానం వద్ద కారులోంచి తోసేసి పరారయ్యాడు. అయితే, తమను మోసం చేసింది ఎవరో తెలియకపోవడంతో ఆ మహిళలు ఇద్దరూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు టీవీలో అతడ్ని చూసి గుర్తుపట్టి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

More Telugu News