Andhra Pradesh: నేను ఎవ్వరికీ బకాయి పడలేదు.. సాక్ష్యాలు చూపిస్తే సెటిల్ చేస్తా!: కేశినేని నాని

  • గుంటూరు లేబర్ కోర్టుకు 14 మంది వెళ్లారు
  • కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నా
  • ఎవ్వరి ట్వీట్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు

కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ఆందోళనపై ఆ సంస్థ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తన సంస్థలో పనిచేసినవారిలో ఎవ్వరికీ తాను బకాయి పడలేదని కేశినేని నాని తెలిపారు. జీతాలు అందలేదని గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది మాత్రమే కేసు పెట్టారని చెప్పారు. తాను కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే నడుచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేశినేని ట్రావెల్స్ సిబ్బంది విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు.

తాను నిజంగా ఉద్యోగులకు బకాయి ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే సెటిల్ చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, వందలాది మందికి జీతాలు ఇవ్వనట్లు ట్వీట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జీతాలు అందని వందల మంది కార్మికులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి ట్వీట్లకూ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పారు.

More Telugu News