Biggboss: బిగ్ బాస్ ఎపిసోడ్: తన భార్యకు గౌరవం ఇవ్వాలని మహేశ్ కు వరుణ్ సందేశ్ వార్నింగ్!

  • మొదలై వారం కాకుండానే గొడవలే గొడవలు
  • తనతో అమర్యాదగా మాట్లాడుతున్నాడని వితిక ఫిర్యాదు
  • సిగ్గులేదా? అంటూ గొడవకు దిగిన వరుణ్ సందేశ్

టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ మొదలై వారం గడవకుండానే, హౌస్ మేట్స్ లో గొడవలు తెగ జరుగుతున్నాయి. గురువారం నాడు కంటెస్టెంట్స్ మధ్య కావాల్సినంత గొడవ జరిగింది. వంట గది గొడవను ప్రేక్షకులు ఇంకా మరువక ముందే, తన చపాతీని మరెవరో తినేశారని పునర్నవి, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ను సరిగా ఉపయోగించుకోలేదని, తన భార్యకు మర్యాద ఇచ్చి మాట్లాడాలని వరుణ్‌ సందేశ్‌ గొడవలు పడగా, మధ్యలో జాఫర్‌, హేమ, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు కాస్త వినోదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లే రూమ్‌ డోర్‌ వద్ద మహేశ్ నిలుచున్న వేళ, తాను వెళుతుంటే మర్యాద లేకుండా మాట్లాడాడంటూ వితిక ఆరోపించడంతో మొదలైన గొడవ తారస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం కూడా మహేశ్ తనతో అలాగే మాట్లాడాడని వితిక ఆరోపించింది. ఈలోగా అటుగా వచ్చిన వరుణ్ సందేశ్, వేలు చూపుతూ, తన భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని హెచ్చరించాడు.

దీంతో మహేశ్, 'ఏంటి వేలుచూపిస్తున్నావ్, కొడతావా?' అని గద్దిస్తూ, మీదకెళ్లాడు. ఈ ఘటనను చూసి సర్దిచెప్పేందుకు రాహుల్ ప్రయత్నించగా, అతనిపైనా మహేశ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక వరుణ్ అయితే, 'సిగ్గులేదా? ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో' అంటూ మరోసారి రెచ్చిపోయాడు. ఇక నేటి ఎపిసోడ్ లో ఈ గొడవ కంటిన్యూ అవుతుందో లేక మరో గొడవ మొదలవుతుందో చూడాలి.

More Telugu News