Andhra Pradesh: చంద్రబాబుపై దాడికి కుట్ర.. ఇందుకోసం ముగ్గురు ఎమ్మెల్యేలను జగన్ సిద్ధం చేశారు!: బుద్ధా వెంకన్న

  • చంద్రబాబును అవమానిస్తున్నారు
  • ఏకవచనంతో సంబోధిస్తూ దాన్ని దాచేస్తున్నారు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని అవమానాలకు గురిచేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.  అధికారపక్ష సభ్యులు చంద్రబాబును ఏకవచనంతో పిలుస్తూ విమర్శలు చేస్తే, వాటిని టీవీల్లో చూపించడం లేదని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుజాతిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి కుట్ర జరుగుతోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

ఇందుకోసం వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కారుమురి నాగేశ్వరరావు, మధుసూదనరెడ్డిలను జగన్ రౌడీల్లా తయారు చేశారని విమర్శించారు. ఈ ముగ్గురు నేతలను టీడీపీ సభ్యులవైపు కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో ఎంత ముందుకెళ్లిందో, జగన్ సీఎం అయ్యాక అంతే వెనక్కు వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అపనమ్మకంతో ఎన్నో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

More Telugu News