Jashit: కిడ్నాపర్ల గురించి నాలుగేళ్ల చిన్నారి జషిత్ చెప్పిన వివరాలు!

  • నాలుగు రోజుల హైడ్రామా
  • కిడ్నాపర్ల గురించి పెద్దగా సమాచారం ఇవ్వలేకపోయిన జషిత్
  • పట్టుకు తీరుతామన్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపిన జషిత్‌ కిడ్నాప్ వ్యవహారం నాలుగు రోజుల హైడ్రామా అనంతరం సుఖాంతం కాగా, తన కిడ్నాప్ గురించి బాలుడు మాట్లాడాడు. తను నిన్న ఓ తాతయ్య దగ్గర ఉన్నానని, ఏదో ఊరిలో తనను ఉంచారని చెప్పాడు. ఆ ఊరి పేరును మాత్రం చెప్పలేదు.

కిడ్నాపర్లలోని ఒకబ్బాయి రాజు, తనను వాళ్ల అత్తా వాళ్లింటికి తీసుకెళతానని చెప్పాడని, తరువాత మరో అబ్బాయి ఇంట్లో వదిలేశారని అన్నాడు. రోజూ తనకు ఇడ్లీలే పెట్టారని చెప్పిన జషిత్, రాజు అనే అబ్బాయే తనను బైక్ పై తిప్పాడని చెప్పాడు. ఓ చిన్న పిల్లాడు వస్తున్నాడు, కలుద్దామని తనకు చెప్పి, కారులో తెచ్చి వదిలేసి వెళ్లిపోయారని అన్నాడు.

కాగా, జషిత్ చెప్పే మాటలను బట్టి కిడ్నాపర్లను గుర్తించడం చాలా కష్టమని, అయినా, తాము వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు పేర్కొన్నారు. జషిత్ తిరిగి ఇంటికి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. జషిత్ వచ్చాడని తెలుసుకున్న అతను చదివే స్కూలు విద్యార్థులు పెద్దఎత్తున ఇంటి వద్దకు వచ్చి అభినందించి వెళ్లారు.

More Telugu News