Andhra Pradesh: పెన్సిళ్లు దొంగలిస్తున్నాడని రెచ్చిపోయిన తల్లి.. కుమారుడికి అట్లకాడతో వాతలు!

  • కుమార్తెకూ వాతలు పెట్టిన తల్లి
  • విశాఖపట్నం జిల్లాలో ఘటన 
  • చికిత్స పొందుతున్న చిన్నారులు

పిల్లాడు స్కూలులో దొంగతనం చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఓ తల్లి రెచ్చిపోయింది. కన్నబిడ్డలన్న కనికరం లేకుండా కుమారుడితో పాటు కుమార్తెకు కూడా వాతలు పెట్టింది. దీంతో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిపాలు కాగా, తల్లికి కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని చినముషిడివాడ హైస్కూలులో వరుణ్ మూడో క్లాస్, అతని అక్క గాయత్రి నాలుగో క్లాస్ చదువుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ తోటి విద్యార్థుల పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు దొంగలిస్తున్నాడని టీచర్ల నుంచి ఫిర్యాదు అందింది. దీంతో కోపంతో ఊగిపోయిన తల్లి వరుణ్ కు అట్లకాడతో వాతలు పెట్టింది.

వాడు దొంగలిస్తుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నావ్? అంటూ గాయత్రికి కూడా వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న 'వన్ స్టాప్' సెంటర్ నిర్వాహకులు ఇంటికెళ్లి పిల్లలను పరామర్శించారు. తల్లికి కౌన్సెలింగ్ అందించారు. అనంతరం ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

More Telugu News