Union Minister: సభలో కాస్త హుందాగా ఉండడం నేర్చుకోండి: సొంత పార్టీ సభ్యుడిపై మంత్రి స్మృతి ఇరానీ చురక

  • లైంగిక నేరాలపై చర్చ సందర్భంగా పోర్న్ ప్రస్తావన
  • తనకు పాప్ కార్న్ తెలుసు కానీ పోర్న్ తెలీదన్న ఎంపీ
  • సభలో చాలామంది మహిళలు ఉన్నారన్న మంత్రి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ హర్‌నాథ్ సింగ్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాస్త హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లైంగిక నేరాల సవరణ చట్టంపై సభలో చర్చ సందర్భంగా హర్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. లైంగిక నేరాలు పెరగడానికి టీవీలు, సోషల్ మీడియానే కారణమని ఆరోపించారు.

పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. ఒకసారి తన స్నేహితుడు ఒకరు ఇంటికి వచ్చారని ఈ సందర్భంగా మాటల మధ్యలో పోర్న్ గురించి మాట్లాడాడని గుర్తుచేశారు. అతడి మాటలతో తాను గందరగోళానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. తాను పాప్‌కార్న్ గురించి విన్నాను కానీ పోర్న్ గురించి వినలేదని జోక్ చేశానని గుర్తు చేసుకున్నారు.

ఎంపీ హర్‌నాథ్ ప్రసంగానికి మంత్రి స్మృతి ఇరానీ అడ్డు తగులుతూ.. సభలో చాలామంది మహిళలు ఉన్నారని, కాస్త హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. దేశం మొత్తం సభను చూస్తోందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. యాదవ్ తన కంటే పెద్దవారని, ఆయన తన ఆందోళనను హుందాగా వ్యక్తపరచాలని కోరారు.

More Telugu News