Kanna: బీజేపీలో చేరుతానన్న రాయపాటి వ్యాఖ్యలపై కన్నా స్పందన!

  • రాయపాటి బీజేపీలో చేరుతున్నట్టు నాకు సమాచారం లేదు
  • శ్రావణ మాసంలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయి
  • సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు

బీజేపీలో చేరబోతున్నట్టు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, రాయపాటి, కొందరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే, బీజేపీలో చేరాలనే ఆలోచనలో చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారనే విషయం మాత్రం వాస్తవమని తెలిపారు. ఆషాఢ మాసం కావడంతో చేరికలకు బ్రేక్ పడిందని చెప్పారు. శ్రావణ మాసంలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు.

ఏపీ పట్ల ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధిని తెలుసుకుని నాయకులతో పాటు, ప్రజలు కూడా బీజేపీకి ఆకర్షితులవుతున్నారని కన్నా చెప్పారు. బీజేపీ శ్రేణులపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని... పోలీసులు పట్టించుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాసినా... ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు రాసిన లేఖలకు స్పందించడాన్ని జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.

More Telugu News