Tamil Nadu: ప్రియుడి కోసం ఓ భార్య దారుణం...బిర్యానీలో విషం కలిపి భర్తపై హత్యా యత్నం!

  • కూతురు పుట్టిన రోజునాడే ఘాతుకం
  • అంతకు ముందు దంపతుల మధ్య గొడవ
  • దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం

ప్రియుడి మోజులో నిండా మునిగిపోయిన ఆ మహిళ తన మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన భర్త విషయాన్ని మర్చిపోయింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఏకంగా అతనికి విషం పెట్టి చంపాలని ప్రయత్నించింది. అదీ కన్నకూతురు పుట్టిన రోజునాడే ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా జోలార్‌పేట, ఏగిరి కొండ అత్తనావూరుకు ప్రాంతానికి చెందిన  సెల్వం (38), జయమతి (33) దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. సెల్వం  హోసూరులో ఉద్యోగం చేస్తుండడంతో అక్కడే ఉండి అప్పుడప్పుడూ వస్తుంటాడు.

జయమతి జోలార్‌పేటలో చదువుతున్న సమయంలోనే ఓ అధ్యాపకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీన కుమార్తె పుట్టిన రోజు ఉందని సెల్వం ఇంటికి వచ్చాడు. ఆ సందర్భంగాను దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్త అడ్డు తొలగించుకుంటే తప్ప మరో మార్గం లేదని భావించిన జయమతి బిర్యానీలో విషం కలిపి వండి భర్తకు పెట్టింది.

దాన్ని తిన్న సెల్వం కాసేపటికి వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన సెల్వం కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జయమతి పరారయ్యింది. పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

More Telugu News