Arunachal Pradesh: ముగ్గురు ఎమ్మెల్యేలను నిండా ముంచిన మోసగాడు.. కేబినెట్ బెర్త్‌లు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు

  • ఎంపీ పీఏనని నమ్మబలికిన నిందితుడు
  • మంత్రి పదవులు ఇప్పించాల్సిందిగా కోరిన ఎమ్మెల్యేలు
  • డబ్బులు దండుకుని మాయం

ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇప్పిస్తానని నమ్మబలికి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ఎమ్మెల్యేలను మోసం చేసిన నిందితుడికి పోలీసులు అరదండాలు వేశారు.

ఢిల్లీకి చెందిన సంజయ్ తివారీ అనే వ్యక్తి ఓ ఫంక్షన్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలను కలిశాడు. తనను తాను ఫలానా ఎంపీ పీఏనని పరిచయం చేసుకున్నాడు. రాజకీయ పరమైన విషయాల్లో తాను సాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్‌లో తమకు చోటు కల్పించాల్సిందిగా ఎమ్మెల్యేలు అతడిని కోరారు.

దీంతో తాను ఎంపీతో మాట్లాడతానని చెప్పి వారికి అభయం ఇచ్చాడు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసి తాను మాట్లాడానని, డబ్బులు పంపమన్నారని ఎమ్మెల్యేలకు చెప్పాడు. దీంతో వారు తివారీ బ్యాంకు ఖాతాకు అతడు చెప్పిన మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, ఆ తర్వాతి నుంచి అతడు పత్తాలేకుండా పోయాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్‌ను అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News