Uttar Pradesh: వేరే కులమైనందుకు అన్నంతపనీ చేశారు... ఎమ్మెల్యే కుమార్తె భర్తపై అలహాబాద్ హైకోర్టు ఎదుట దాడి

  • బరేలీ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్ మిశ్రా
  • మరో కులపు యువకుడిని పెళ్లాడిన రాజేశ్ కుమార్తె
  • అలహాబాద్ హైకోర్టు ముందు దాడి 

తాను వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందున, తన తండ్రి నుంచి ప్రాణహనీ ఉందని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తె సోషల్ మీడియాలో పెట్టిన వీడియో గతవారంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భయపడినంతా అయింది. అలహాబాద్ హైకోర్ట్ ముందు, పలువురు చూస్తుండగా, బరేలి ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా భర్త అభితేష్ కుమార్‌ పై దాడి జరిగింది. ప్రస్తుతం ఈ జంట పోలీసుల రక్షణలో ఉండగా, వారి కళ్లెదుటే ఈ దాడి జరిగింది. దాడి చేసేందుకు వచ్చిన వారు సాక్షి మిశ్రా జోలికి మాత్రం వెళ్లలేదు.

కాగా, తనను చంపడానికి తండ్రి కొందరిని పంపితే తప్పించుకున్నామని, భవిష్యత్తులో తన భర్తకు గానీ, అతని బంధువులకు గానీ ఏమైనా హానీ జరిగితే, అది తండ్రి, సోదరుడు విక్కీ బాధ్యులని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని సాక్షి కోరిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, తన కుమార్తె, ఆమె కన్నా వయసులో 9 ఏళ్లు పెద్దయిన వ్యక్తిని పెళ్లాడటం నచ్చలేదని, ఆమె ఇంటికి వస్తే ఆహ్వానిస్తామని రాజేశ్ వ్యాఖ్యానించారు. అంతలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అభితేష్ పై దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News