Andhra Pradesh: ఏపీలో టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది: బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్

  • ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది
  • విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ
  • ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పరిస్థితే ఎదురువుతుంది

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని, ఇక, టీడీపీ కూడా ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పరిస్థితే ఎదురువుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని నడపలేక, అధ్యక్ష పదవిని వదిలి రాహుల్ గాంధీ పారిపోయారని, చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు కోలుకోలేని దెబ్బతిన్నారని విమర్శించారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా, ఏపీకి ప్రత్యేకహోదా వద్దన్నారని, ప్యాకేజ్ కు అంగీకరించారని అన్నారు. ఆ ప్యాకేజ్ కు అనుగుణంగానే కేంద్రం పలు రూపాల్లో నిధులను ఇచ్చిందని, దానిని అప్పటి సీఎం చంద్రబాబు దారి మళ్లించి జేబులో వేసుకున్నారని ఆరోపించారు. ఏపీలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, ఇలాంటి వాటిని బీజేపీ ఎంత మాత్రం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. సభ్యత్వంలో భాగంగా ఏపీలో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.  

More Telugu News