Bollywood: అలనాటి గీతాల్ని రీమిక్స్ చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలి: బాబా సెహగల్ ఫైర్

  • బాలీవుడ్ ‘కాపీవుడ్’లా తయారైంది
  • అసలు గీతం సారాంశం నాశనమవుతోంది
  • కళాకారులు ప్రయోగాలు చేయాలి

ఈ మధ్య కాలంలో రీమిక్స్ గీతాలు బాగా ఎక్కువవుతున్నాయి. బాలీవుడ్‌లో అలనాటి గీతాలను రీమేక్స్ చేయడంపై ప్రముఖ సంగీత దర్శకుడు బాబా సెహగల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రీమిక్స్ కారణంగా అసలు పాట సారాంశం నాశనమవుతోందంటూ ఇన్‌స్టాగ్రాం వేదికగా మండిపడ్డారు. నాటి గీతాల్ని రీమిక్స్ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పాలన్నారు. బాలీవుడ్ ‘కాపీవుడ్’లా తయారైందంటూ బాబా సెహగల్ ఆవేదన వ్యక్తం చేశారు. రీమిక్స్ వెర్షన్‌ సంగతేమో కానీ అసలు గీతం సారాంశం నాశనమవుతోందన్నారు. రీమిక్స్ గీతాల్లో కొత్తదనం ఏమీ ఉండట్లేదని కళాకారులు ప్రయోగాలు చేయాలని సూచించారు.

ఒక పేరొందిన గీతాన్ని రీమిక్స్ చేస్తున్నప్పుడు సంగీత దర్శకుడి బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. రీమిక్స్ పేరుతో పాట అద్భుతంగా రాకపోగా..  అసలుకే ఎసరొస్తోందన్నారు. పాత గీతాల్ని రీమిక్స్ చేయాలనుకునే నిర్మాతలు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశమిస్తే ప్రతిభ బయటకు వస్తుందన్నారు. హిట్ గీతాల్ని తమ వెర్షన్‌లో పాడిన గాయకులను, రియాల్టీ షోలలో అద్భుతంగా పాడుతున్న చిన్నారులను తాను చూశానన్నారు. ప్రశంసలు, విమర్శలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రీమిక్స్‌ల విషయంలో తన మనసులో మాటను పంచుకోవడమే తన ఉద్దేశమని, ఇతరుల్ని తప్పుబట్టడం కాదని బాబా సెహగల్ పేర్కొన్నారు.

More Telugu News