Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టే గొప్పదట... కొత్త వితండవాదాన్ని తెరపైకి తెచ్చిన పాక్ ఫ్యాన్స్!

  • ఇండియాను ఓడించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్
  • ఆ రెండు జట్ల మధ్య పోటీ
  • తాము ఫైనలిస్టులనే ఓడించామంటున్న పాక్

ఇంగ్లండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించే జట్టు చాంపియన్ గా నిలుస్తుందని పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే జరిగింది కూడా. లీగ్ దశలో న్యూజిలాండ్ - ఇండియాల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియాను లీగ్ దశలో ఇంగ్లండ్ ఓడించగా, సెమీస్ లో న్యూజిలాండ్ ఓడించింది. ఇప్పుడు ఈ రెండు జట్లూ ఫైనల్ ఆడనున్నాయి. ఎటునుంచి ఎటు చూసినా చాంపియన్ గా నిలిచేది ఇండియాపై గెలిచిన జట్టే.

ఇక ఈ టోర్నీలో అన్నింటికన్నా బలమైన జట్టు తమదేనని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఓ సరికొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? ఫైనల్ ఆడుతున్న రెండు జట్లనూ పాకిస్థాన్ లీగ్ దశలో మట్టి కరిపించిందట. ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిందని, ఆ రెండింటినీ తాము ఓడించాం కాబట్టి, తమదే గొప్ప జట్టని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఓడిపోయినా ఈ విధంగా సమర్థించుకోవడం ఒక్క పాక్ కే చెల్లిందని సెటైర్ల మీద సెటైర్లు వస్తున్నాయి.

More Telugu News