bjp: ఈ 21న కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది: కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య

  • బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది
  • మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేసింది
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 21న కేబినెట్ విస్తరణ జరగనుందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేసిందని, డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్ లో ఇదంతా జరుగుతోందని విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తమకే ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని, అసమ్మతి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు చట్టం ప్రయోగించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలని, ఈ విషయమై స్పీకర్ రమేశ్ కుమార్ ను కోరుతున్నట్టు చెప్పారు.

More Telugu News