Crime News: అర్ధరాత్రి ఆ భవనంలో క్షుద్ర పూజలు...పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు

  • ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కాకినాడలో కలకలం రేపిన సంఘటన
  • వరుసగా యువత, పిల్లలు చనిపోతున్నారని సిద్ధాంతిని ఆశ్రయించిన బాధితులు

ఆకస్మికంగా యువకులు, పిల్లలు చనిపోతుండడంతో తల్లడిల్లిన బాధిత కుటుంబాలు ఓ సిద్ధాంతిని ఆశ్రయించి క్షుద్ర పూజలు చేయించేందుకు సిద్ధపడడం కాకినాడలో కలకలానికి కారణమైంది. అర్ధరాత్రి అనుమానాస్పదంగా పూజలు జరుగుతుండడం గమనించిన స్థానికులు, చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న సర్పవరం పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...కాకినాడ నగర పరిధి గొడారిగుంటలోని సీతారాంపురం సగర సామాజిక భవనంలో నిన్న అర్ధరాత్రి కొందరు క్షుద్రపూజలు నిర్వహించారు. రాజపూడికి చెందిన ఓ సిద్ధాంతి ఆధ్వర్యంలో కుండల్లో నెయ్యిపోసి దీపారాధన చేశారు. పెద్ద ఎత్తున కుంకుమ, కొబ్బరి బొండాలతోపాటు మూడు నాటు కోళ్లు సేకరించి ఉంచారు. ఈ సన్నివేశాలను గమనించిన స్థానికులు భయాందోళనలతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. సగరపేటకు చెందిన కొందరు యువకులు, పిల్లలు హఠాత్తుగా మరణిస్తుండడంతోనే వారు ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News