Andhra Pradesh: జగన్ గారూ.. ఇలాగైతే ఏపీలో పగిలిన సోలార్ ప్యానెళ్లు, మీ తుపాకులే మిగులుతాయ్! నారా లోకేశ్ హెచ్చరిక

  • మీరు ఏపీ యువత భవిష్యత్ ను ధ్వంసం చేస్తున్నారు
  • కర్నూలులో మీ నేతలు సోలార్ పార్కువారిని తుపాకులతో బెదిరించారు
  • కడపలో ఏకంగా సోలార్ ప్యానెళ్లను ధ్వంసం చేశారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన రివర్స్ టెండరింగ్ పద్ధతిపై టీడీపీ నేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ నేతలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఇప్పుడు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. నిన్న వైసీపీ నేతలు కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడ్డారనీ, అక్కడివారిని తుపాకీతో బెదిరించారని లోకేశ్ ఆరోపించారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాలని వైసీపీ నేతలు సోలార్ పార్కు యాజమాన్యాన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేరకంగా కడప జిల్లాలోని మైలవరంలో మరో సోలార్ పార్కులోని ప్యానల్స్ ను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.

‘మీ ఎమ్మెల్యేలు పగులకొడుతోంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తును. మీ వాళ్ల దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి’ అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను తన ట్వీట్లకు జతచేశారు.

More Telugu News