Bihar: స్కూలు నుంచి ఇంటికొస్తున్న బాలిక.. కారులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

  • బీహార్‌లోని సరాన్ జిల్లాలో ఘటన
  • కారులో ఐదుగురు వ్యక్తులు
  • అత్యాచారానికి పాల్పడింది మాత్రం ముగ్గురే

బీహార్‌లో మరో అఘాయిత్యం జరిగింది. స్కూలు ముగిశాక సైకిలుపై ఇంటికొస్తున్న బాలికను కారులోకి లాక్కెళ్లిన ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సరాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

17 ఏళ్ల బాలిక స్కూలు ముగిసిన అనంతరం సైకిలుపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. కారులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బసంత్ రోడ్డులో బాలికను కారు నుంచి కిందికి తోసేసి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడిన బాలిక పాదచారుల మొబైల్ ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గంటపాటు ఆమెను కారులో తిప్పి అత్యాచారానికి ఒడిగట్టారని సరాన్ జిల్లా ఎస్పీ హరికిశోర్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, అత్యాచారానికి పాల్పడింది మాత్రం ముగ్గురేనని వివరించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News