assam: చెత్తే ఫీజు.. రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెబుతున్న పాఠశాల!

  • అస్సాంలో అక్షర్ ఫోరమ్ వినూత్న ప్రయోగం
  • ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పై విద్యార్థులకు క్లాసులు
  • సాయం చేసే విద్యార్థులకు చిరు మొత్తాలను అందిస్తున్న స్కూలు

పాఠశాలల్లో ఏం నేర్పిస్తారు? అనగానే ఇదేం ప్రశ్న. పిల్లలకు చదువుతో పాటు మంచి నడవడికను నేర్పిస్తారు అని ఎవరైనా ఠక్కున జవాబిస్తారు. కానీ అసోంలోని అక్షర్ ఫోరమ్ స్కూలుకు వెళితే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ పాఠశాలలో చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పిస్తారు. ఈ స్కూలులో చేరే పిల్లలందరికీ ఉచితంగా చదువు చెబుతారు. ఇందుకు ప్రతిఫలంగా విద్యార్థులంతా ప్లాస్టిక్ ను సేకరించాల్సి ఉంటుంది. వారానికి 20 ప్లాస్టిక్ వస్తువులను విద్యార్థులు సేకరిస్తారు. అనంతరం ఇక్కడి ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా ప్రాసెస్ చేయాలో విద్యార్థులకు చెబుతారు.

అంతేకాదు ఇకపై ఇళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చబోమని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకుంటారు. అక్షర్ ఫోరమ్ స్కూలులో ప్రస్తుతం 110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్నట్లు ఈ ప్లాస్టిక్ ను ఏం చేస్తారన్న అనుమానం మీకు వచ్చిందా? ఈ వ్యర్థాలతో తరగతి గదులు, టాయిలెట్లు, మొక్కల చుట్టూ రక్షణగా గోడ లాంటి నిర్మాణాలను చేబడుతున్నారు. ఇందుకోసం సాయం చేసే విద్యార్థులకు కొంత నగదును కూడా అందించి స్కూలు యాజమాన్యం తమ వంతు సాయం చేస్తోంది. ఇలాంటి స్కూళ్లు మరిన్ని ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ..

More Telugu News